తాజా పండ్లతో ఫేషియల్స్‌

కలల సోయగాన్ని.. కాంతులీనే చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రకృతికి మించిన స్ఫూర్తి ఏముంటుంది! తాజా పండ్లలో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికే కాదు... సౌందర్యానికీ ఎంతగానో దోహదం చేస్తాయి. విభిన్న రకాల ఫలాలతో ఫేషియల్స్‌ చేయించుకోవడం అన్నది నానాటికీ ఆదరణ పొందుతున్న తీరు. ఈ మండు వేసవిలో సహజ సౌందర్యానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి.

వేసవి ప్రభావం మొదలైంది. బయటికెళితే చాలు, చర్మం కందిపోవడం, కమిలిపోవడం, మెరుపు తగ్గి పొడిబారడం ఆరంభమైంది. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఎంతో ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు తాజా పండ్లు, రసాలు, సెరమ్‌తో చేసిన పదార్థాలతో ఫేషియల్స్‌ వేసుకోవచ్చు. అవి చర్మ గ్రంథులు తెరుచుకోకుండా, కోమలత్వం చెదరకుండా కాపాడతాయి. శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా విటమిన్లు, పొటాషియం, సల్ఫర్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఈ లాభాలన్నీ పండ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగితే.. పండ్ల గుజ్జు సౌందర్య సాధనంగా మేలు చేస్తుంది.

వేసవిలో చర్మానికి హాయి..
సౌందర్య చికిత్సలో వాడదగిన పండ్లలో మామిడి, అరటి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, దానిమ్మ, పుచ్చకాయ, బత్తాయి, నారింజ, ఖర్జూరం, బొప్పాయి.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్కోపండుది ఒక్కో ప్రత్యేకత. ప్రతి పండు మేని నిగారింపును పెంచడం ఖాయం.


మామిడితో పసిమి చాయ: 
ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును సౌందర్య చికిత్సలో వాడవచ్చు. రెండు చెంచాల మామిడి గుజ్జు, చెంచా చొప్పున తేనె, పెరుగు తీసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి, ముఖం, మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు సున్నితంగా మర్దన చేసి వదిలేయాలి. పది నిమిషాల తరవాత నీళ్లతో కడిగేసుకుంటే చాలు. అయితే సబ్బు వాడకూడదు. ఇలా వేసవంతా రోజు మార్చి రోజు ఈ పూత వేసుకోగలిగితే.. చర్మం పసిమిచాయతో మెరిసిపోతుంది.

'అరటి' పూత అద్భుతం: 
ఈ పండు చర్మానికి మంచి తేమనస్తుంది. దీన్ని కూడా ఏ చర్మతత్వం వాళ్లయినా వాడవచ్చు. ముఖ్యంగా పొడి చర్మతత్వం గలవారికి చాలా మంచిది. ముఖంపై ఉన్న ముడతల్ని నివారించే శక్తి ఈ పండు సొంతం. అరటిపండును కొద్దిగా కోసి ఆ ముక్కను తేనెలో ముంచి ముఖం నుంచి మెడ దాకా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాలు చేయాలి. ఆ తరవాత కడిగేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది.

స్ట్రాబెర్రీతో సొగసుగా: 
జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పని చేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనె తీసుకుని పూతలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్నవాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్‌ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది.

ద్రాక్షతో ధగధగ: 
అరకప్పు ద్రాక్షపండ్లను గుజ్జులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే చాలు. ఎంతో మార్పు ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ముల్తానీమట్టిని ద్రాక్ష రసంలో కలిపి పూతలా వేసుకోవచ్చు. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.

దానిమ్మతో అందం:
  ఎండ వల్ల చర్మం సహజ అందాన్ని కోల్పోతుంది. వార్థక్యపు చాయలు తప్పవు. అలాంటి సమస్యల్ని నివారించి.. చర్మంలో కొలాజిన్‌ ఉత్పత్తి, సాగేగుణాన్ని పెంచాలంటే.. దానిమ్మ పూతను ప్రయత్నించాలి. ఎలాంటి చర్మతత్వం గలవారైనా ఈ పండును వాడవచ్చు. దానిమ్మ గింజలకు కొద్దిగా బొప్పాయి గుజ్జు కూడా కలిపి వాడితే.. చర్మం రంగు పెరగడమే కాదు.. ముడతలు కూడా తగ్గుతాయి. చెంచా బొప్పాయి గుజ్జులో దానిమ్మ రసం రెండు చెంచాలు, చెంచా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరవాత మునివేళ్లను తడిచేసుకుని పూతపై రుద్దుతూ తొలగించుకోవాలి.

పుచ్చకాయ ప్యాక్‌:
ఈ పండు చర్మాన్ని చాలా త్వరగా చల్లబరుస్తుంది. రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు, అరచెంచా తేనె, ఒకటిన్నర చెంచా ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ కలిపి చర్మానికి పూత వేయాలి. దీనివల్ల ఎండకు ఎర్రగా మారిన చర్మంలో చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. అందంగానూ మారుతుంది.

బొప్పాయితో బహుచక్కగా: 
అన్ని రకాల చర్మతత్వాల వారికీ మేలుచేసే బొప్పాయిపండు గుజ్జును చర్మానికి నేరుగా రాయకూడదు. దానివల్ల చర్మం చాలా మొరటుగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. చెంచా బొప్పాయి గుజ్జులో అదే మోతాదులో కీరదోస గుజ్జు కలిపి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం తళుకులీనుతుంది. తేటగా కనిపిస్తుంది.

ఖర్జూర ప్యాక్‌: 
నాలుగైదు ఎండు ఖర్జూరాలను నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత చిక్కగా చేసుకుని అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయత్నించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top