రెండు చెంచాల చందనం పొడిలో చిటికెడు పసుపు, కాసిని నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక కడిగేయాలి. తరచూ ఈ పూతను ప్రయత్నిస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలూ దూరమవుతాయి. అలాగే నాలుగు చెంచాల గంధం పొడిలో తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి మర్దన చేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే...చాలు.
అప్పుడప్పుడు చర్మంపై దద్దుర్లు.. దురదల్లాంటివి బాధిస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. రెండు చెంచాల గంధంపొడిలో చిటికెడు పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పూతలా వేసి ఇరవైనిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఎంతో మార్పు ఉంటుంది. చర్మం తేటగానూ కనిపిస్తుంది.
కొబ్బరి నూనెలో తగినంత గంధం పొడి కలిపి స్నానానికి ఇరవైనిమిషాల ముందు శరీరానికి రాసుకోవాలి. మేను తాజాదనంతో పరిమళిస్తుంది. తేమనూ సంతరించుకుంటుంది. పొడి చర్మతత్వం గలవారికి ఈ పూత ఎంతో మేలుచేస్తుంది. చర్మం పొడి బారి కాంతివిహీనంగా మారినప్పుడు మూడు చెంచాల గంధం తీసుకొని అందులో తులసి ఆకులను దంచి రసం తీసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పూత వేసి చేతులకు మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగితే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
గంధం టాన్క్లీనర్గానూ పనిచేస్తుంది. ఏం చేయాలంటే.. ఐదు చెంచాల కొబ్బరి నూనెకు రెండు చెంచాల బాదం నూనె, చెంచా గంధం కలిపి ఎండ వల్ల నల్లగా మారి కమిలిన చర్మంపై రాయాలి. కాలుష్యం వల్ల పేరుకున్న మురికి, జిడ్డు పూర్తిగా తొలగిపోతాయి. చర్మం కాంతిమంతంగానూ తయారవుతుంది. మరో పనీ చేయవచ్చు. కీరదోస రసం, పచ్చిపాలు రెండు చెంచాల చొప్పున తీసుకుని తగినంత గంధం, కొద్దిగా బాదం పొడి కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో భద్రపరచుకొని రోజూ నలుగు పిండిలా కూడా వాడుకుంటే.. చర్మం రంగు మారుతుంది. నిగారింపునూ సంతరించుకుంటుంది.