కావల్సినవి:
మైదా- పావుకేజీ, మిరియాల పొడి, జీలకర్ర పొడి- అరచెంచా చొప్పున, ఉప్ప, కారం- తగినంత, బంగాళాదుంపలు- మూడు, గరం మసాలా- అరచెంచా, క్యారెట్ తురుము- కప్పు, ఉల్లిపాయలు- మూడు, కొత్తిమీర, పుదీనా- కట్ట చొప్పున, వంటసోడా- చిటికెడు, టమాటా సాస్, పెరుగు- కప్పు చొప్పున, టమాటాలు- రెండు, చాట్ మసాలా- చెంచా, సన్న కారప్పూస - కప్పు, నూనె - వేయించడానికి సరిపడా, పచ్చిమిర్చి- నాలుగు, నిమ్మకాయ- ఒకటి.
గ్రీన్ చట్నీ కోసం:కొత్తిమీర, పుదీనా కట్టచొప్పున, మూడు పచ్చిమిర్చి, తగినంత ఉప్పు తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి.
తయారీ:
మైదాపిండికి జీలకర్ర, మిరియాల పొడి, వంటసోడా, ఉప్పు, కాసిని నీళ్లు చేర్చి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అరగంటయ్యాక పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తరవాత ఒక గిన్నె తీసుకొని దాని అడుగు భాగంలో నూనె రాసి వత్తుకున్న పూరీని అతికించాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి గిన్నెతో సహా పూరీని వేయించాలి. వేగాక గిన్నె విడిపోతుంది. ఇలా మిగిలిన పూరీలు చేసుకోవాలి.
స్టఫింగ్ కోసం :
బంగాళాదుంపను ఉడికించాక పొట్టు తీసి చేత్తో మెత్తగా ముద్ద చేసి.. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదాతో చేసుకున్న కప్పుల లోపల టమాటాసాస్, గ్రీన్ చట్నీ రాసి.. బంగాళాదుంప మిశ్రమాన్ని నింపాలి. దానిపైన సన్నగా తరిగిన టమాటా, ఉల్లి ముక్కలు, క్యారెట్, కొత్తిమీర తురుము, టమాటాసాస్, కారప్పూస, పెరుగు వేసుకొని అలంకరించుకుంటే చాట్ సిద్ధమయినట్టే. సాయంత్రవేళ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.