పీచుపదార్థం అధికంగా ఉన్న ఆహారం ఇప్పుడు సంజీవని ఔషధంలా మారింది. అజీర్ణం నుంచి జీర్ణాశయ క్యాన్సర్ వరకు, మధుమేహం నుంచి ఊబకాయం వరకు అన్ని సమస్యలకు పరిష్కాం ఒక్కటే పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం. ఆరోగ్యంగా ఉంటాం కదా అని ఒకటే పనిగా ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే అనర్థాలు తప్పవు.
- మొలకెత్తిన గింజలు, ఓట్స్, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ పప్పులు, రాగి, బాదం వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మధుమేహం, ఊబకాయం దరిచేరవు.
- రోజూ 25 నుంచి 40 గ్రాముల (శరీర అవసరాన్ని బట్టి) వరకు మాత్రమే పీచుపదార్థాలున్న ఆహారం తీసుకోవాలి.
- ఆరోగ్య రీత్యా ఫైబర్ ఉన్న ఆహారం అధికంగా తీసుకోవాల్సి వస్తే దశల వారీగా ఆ ఆహారాన్ని పెంచుకుంటూ పోవాలి. నెలరోజుల పాటు క్రమంగా ఫైబర్ ఆహార పరిమాణాన్ని పెంచుకుంటూపోవాలి.
- ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు మాత్రమే తింటే ఇతర పోషకాలు, క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా ఆహారంలో సమతౌల్యం దెబ్బతింటుంది.
- పీచుపదార్ధాలు అధికంగా ఉన్న ఆహారం ఎక్కువ తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, అల్సర్ల వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
- ఆకలిని తగ్గించే పీచు పదార్థాలకు దూరంగా ఉండకపోతే పరిస్థితి కొండనాలికకు మందువేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా మారుతుంది.