ఏక్తా ఎవరి మాటా వినడం లేదు - షారూక్ ఖాన్ ప్రదర్శన వివాదాస్పదం కాబోతోంది!


ఏక్తా కపూర్ ఒక దుస్సాహసానికి తలపడబోతున్నారు. ఏక్తా సొంత సంస్థ ‘బాలాజీ టెలీ ఫిల్మ్’ మొట్టమొదటిసారిగా ఈ నెల 12న ముంబైలో నిర్వహించబోతున్న ‘గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆనర్స్’ ఫంక్షన్ రసాభాస అయ్యే ప్రమాదం కనిపిస్తోంది! టీవీ, చిత్ర పరిశ్రమలలోని ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేసే ఆ మహోత్సవంలో ఆఖరి ఘట్టం... షారూక్ ఖాన్ ప్రదర్శన. ఆ ఘట్టమే వివాదాస్పదం కాబోతోంది! 2010లోని పది అత్యంత వివాదాస్పద అంశాలను కలనేసి, ఏక్తా బలవంతం మేరకు షారూక్ ఈ ‘షో’లో చూపబోతున్నారు.

నీరా రాడియా టేపుల వ్యవహారం, కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఐ.పి.ఎల్. పాటు బాలీవుడ్ తారల వ్యక్తిగత జీవితంలోని వివాదాస్పద అంశాలను షారూక్ కామెడీగానో, సెమీ కామెడీగానో తన ప్రదర్శనలో ప్రస్తావిస్తారట! అయితే ఇది నైతిక ఉల్లంఘన అని, లేనిపోని తలనొప్పులను ఏక్తాకపూర్ తన మీదికి తెచ్చుకోబోతున్నారని ఆమె శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. థీమ్ మార్చితే బాగుంటుందని షారూక్ సన్నిహితులు కొందరు ఏక్తాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. ‘‘పోనీ ఇంకోలా ఆలోచిద్దాం. పది వివాదాలు కాకుండా, పది టాప్ మూవీస్, లేదా పది టాప్ సాంగ్స్ తీసుకుందాం. వాటి చుట్టూ షో ప్లాన్ చేద్దాం’’ అని షారూక్ సూచించారు. కానీ ఏక్తా కన్విన్స్ కాలేదు’’ అనే మాట కూడా వినిపిస్తోంది. 2008లో బాలాజీ టెలీఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌లో షారూక్ షో దుమ్ము రేపింది. అందుకు ఒక్క ధూళికణమైనా తక్కువ కాకుండా షారూక్‌ను ఆడించి, పాడించాలని ఏక్తా పట్టుదలతో ఉన్నారు.

అవార్డుల ఫంక్షన్ అయ్యాక కూడా ఏక్తా విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. ఆవిడవే మూడు కొత్త టీవీ షోలు వచ్చే మూడు నెలల్లో ఇమాజిన్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, కలర్స్ చానళ్లలో ప్రారంభం కాబోతున్నాయి. సోనీ ప్రైమ్ టైమ్‌లో ప్రసారం కానున్న ఏక్తా సీరియల్ ‘బడే అచ్ఛే లగ్తే హై’ దాదాపు పూర్తయింది. ఇద్దరు మధ్య వయస్కుల మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ పాత్రలను ఏక్తాకు ఎంతో ప్రియమైన సాక్షీ తన్వార్, రామ్ కపూర్ పోషించబోతున్నారు. సాక్షీ తన్వార్‌ను చూడడం కోసం తపిస్తున్న టీవీ వీక్షకులకు ఇది శుభవార్తే. సోనీ చానెల్‌లో ‘క్రైమ్ పెట్రోల్’, కలర్స్‌లో ‘బాలికా వధు’లోని చిన్న ట్రాక్‌లో తప్ప సాక్షి ప్రధాన పాత్రలో కనిపించి ఏడాదయింది!  





రామ్ కపూర్ ప్రస్తుతం ‘ఏజెంట్ వినోద్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతకు ముందు ఆయన ఇమాజిన్‌లోని ‘రాఖీ కా స్వయంవర్’ రెండు సీజన్లకు, ‘రాహుల్ దుల్హనియా లే జాయేగా’ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. బసేరాలో కూడా కనిపించారు. అయితే ఇవేవీ కూడా జీ టీవీలో దీర్ఘకాలం పాటు ప్రసారమైన ‘కసమ్ సే’ తెచ్చిపెట్టినంత పేరును రామ్ కపూర్‌కు తేలేకపోయాయి. ఇప్పుడు వీరిద్దరి (సాక్షి-కపూర్) కాంబినేషన్‌లో ఏక్తా హిట్ కొట్టాలని చూస్తున్నారు. మిగతా రెండు షోల వివరాలను త్వరలోనే ఆమె వెల్లడిస్తారట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top