- తాజా మెంతి ఆకులు తీసుకోండి. వీటిని మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోండి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ డికాక్షన్ చల్లారాక.. ముఖం కడుక్కుని చూడండి. ఎంతో మార్పు ఉంటుంది.
- బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా.. మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్హెడ్స్ లాంటివి దూరమవుతాయి. అలాగే దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేయండి. చెంచా పొడిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది.
- మునగ ఆకుల్ని గుప్పెడు తీసుకుని మెత్తగా నూరి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. మచ్చలతో పాటు.. అధిక జిడ్డూ తొలగిపోతుంది. రెండు కప్పుల నీరు తీసుకుని నాలుగు చెంచాల ఎప్సంసాల్ట్ వేసి గంట తరవాత అందులో దూదిని ముంచి మచ్చలపై బాగా రుద్దాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.
- నాలుగు చెంచా పచ్చిపాలలో రెండుచెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. పావుగంటయ్యాక దూదితో శుభ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. మరో పని కూడా చేయవచ్చు. చందనం పొడి, పసుపు సమపాళ్లలో తీసుకొని నీటితో ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి తడారాక కడిగేయాలి. ఇలా చేస్తే నల్లమచ్చలు, మృత కణాలు క్రమంగా తొలగిపోతాయి.
- గ్రీన్టీలో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా కూడా.. సమస్య పరిష్కారమవుతుంది. వంటనూనె, నిమ్మరసం చెంచా చొప్పున తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.
- గుడ్డులోని తెల్లసొనను ముఖానికి రాయాలి. పది నిమిషాలయ్యాక చల్లటి నీళ్లతో కడిగి.. తువాలుతో తుడిచేస్తే సరిపోతుంది. అలాగే మూడుచెంచాల తేనె, చెంచా యాలకుల పొడి కలిపి ముఖానికి రాసి మర్నాడు కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.
- రెండు చెంచాల పుదీనా రసంలో అరచెంచా పసుపు కలిపి మచ్చలున్నచోట పూతలా వేయాలి. అరగంటయ్యాక తడి చేత్తో మర్దన చేసి ఆ తరవాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. గుప్పెడు వేపాకుల్ని మెత్తగా నూరి అందులో చెంచా పసుపు కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. అరగంటయ్యాక స్నానం చేస్తే మార్పు ఉంటుంది.