ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు స్వంత ఇంటిలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం సూపర్స్టార్ తన కుటుంబంతో కలిసి జర్నలిస్టు కాలనీలో గల ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ పుణ్యమాని ఫిల్మ్ నగర్లో అత్యంత విలాసవంతమైన విల్లా ఒకటి మహేష్ పరమైంది. కానీ ఇళ్లు మారే విషయమై మహేష్ ఆశ్చర్యపోయినంతగా మరెవ్వరూ ఆశ్చర్యపోయి ఉండరు!
పతిదేవుడు మహేష్ బాబును సర్ప్రైజ్ చేయాలనే ఏకైక లక్ష్యంతో నమ్రత గుట్టుచప్పుడు కాకుండా విల్లాను కట్టించి ఆయన ముందుంచారు. నమ్రత ఆధ్వర్యంలో ఆ విల్లా నిర్మితమైంది. భవంతి నిర్మాణంలో ఉండగా మహేష్ ఒక్కసారి కూడా దానిలోకి అడుగుపెట్టలేదు.
కానీ విల్లా నిర్మాణం పూర్తయిన తర్వాత వారం రోజుల క్రితం ఆ భవంతి దగ్గరకు మహేష్ను తీసుకువెళ్లారు. మహేష్ ఒపినీయన్ అడిగారు. విల్లా చాలా బాగుందని మహేష్ కితాబిచ్చాడు. ఇది మరెవరిదో కాదు మనదే అంటూ నమ్రత నవ్వుతూ చెప్పటంతో మహేష్ షాక్ తిన్నాడు.
కొత్త ఇల్లు గురించి మహేష్ ట్విటర్లో రాసుకున్నాడు. ''విల్లా చాలా బాగుంది. కానీ కొంచెం పెద్దదిగా ఉంది. రేంజ్ రోవర్ కొన్నప్పుడు ఎలా ఫీలయ్యానో విల్లా చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. సూపర్ లగ్జరీతో కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుందని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నాను'' అని చెప్పుకొచ్చాడు.