పాదాల పగుళ్లు విపరీతంగా బాధిస్తున్నాయా? వాటి పట్ల ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందిగా మారతాయి. అందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
- నాలుగు మగ్గుల నీళ్లలో చారెడు ఉప్పు, కొద్దిగా షాంపూ వేసి పాదాలను నానబెట్టాలి. పగుళ్లున్న చోట టూత్బ్రష్తో మృదువుగా రుద్దాలి. పావుగంటయ్యాక కాళ్లను చల్లటినీళ్లతో కడిగి తువాలుతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా రాత్రిపూట చేస్తే ఫలితం ఉంటుంది.
- వంట నూనెలలో తేమశాతం ఎక్కువ. పడుకునే ముందు పాదాలను సున్నిపిండితో రుద్ది శుభ్రంగా కడిగి వంటనూనెతో మర్దన చేయాలి. నూలు సాక్సులు ధరించి పడుకుంటే మర్నాటికి మెత్తబడతాయి.
- కొందరికి పగుళ్లు ఎక్కువై నొప్పి బాధిస్తుంటుంది. అలాంటి వారు అరటి పండు గుజ్జుకు చిటికెడు పసుపు జోడించి పాదాలకు రాయాలి. అరగంటయ్యాక కడిగేయాలి. అరటిపండు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పసుపు పగుళ్లలో చేరిన ఇన్ఫెక్షన్ను దూరం చేస్తుంది.
- పావు బకెట్ నీళ్లలో నిమ్మరసం కలిపి అందులో పాదాలను నానబెట్టాలి. దీనివల్ల పగుళ్లలో చేరిన మట్టి తొలగిపోతుంది. అయితే బాగా గాయాలయిన వారు ఈ నియమాన్ని పాటించకపోవడం మంచిది.
- పొడి చర్మం తత్వం వారయితే రాత్రిపడుకునే ముందు కాళ్లు కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- వ్యాసలీన్లో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పగుళ్లు దూరమవుతాయి.
- గులాబీ నీళ్లు, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మర్దన చేయాలి. దీనివల్ల చర్మం సున్నితంగా మారుతుంది.