వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..మురికి నీటిని వడకట్టడం చాలా కష్టమైన ప్రక్రియ. మెక్సికోలోని కొన్ని తెగల ప్రజలు 'నోపాల్ కాక్టస్'(బ్రహ్మజెముడు జాతికి చెందినది) లేదా 'ప్రిక్లీపియర్' అనే మొక్కతో మురికి నీటిని చాలా తేలికగా వడకట్టుకుని తాగడాన్ని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఫ్లోరిడాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎలా..?
ముందుగా ఈ మెక్కను నీటిలో ఉడకబెడతారు. ఆ తర్వాత నీటి నుంచి మెక్కను వేరుచేసి ఆహారంగా తినేస్తారు. మిగిలిన నీటిని తాగే నీటిలో కలుపుతారు. తర్వాత కొంత సేపటికి నీటిలో మురికి, మలినాలన్నీ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఇప్పుడు పై నున్న స్వచ్ఛమైన నీటిని తాగడానికి ఉపయోగించుకుంటారు.
పరిశోధన
ఈ శుద్ధి ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఫ్లోరిడాకు చెందిన కెమికల్ ఇంజనీర్ నార్మా ఆల్కాంటర్, ఆమె బృందం రంగంలోకి దిగింది. ఈ మొక్కలో ఉండే మ్యుసిలే జ్ అనే పదార్థం నీటిని శుద్ధి చేస్తున్నట్లు వీరి పరిశోధనలో తేలింది. ఈ పదార్థం నోపాల్కాక్టస్ మొక్కలో నీటి నిల్వకు సహకరించే బాధ్యతను నిర్వహిస్తుంది. మ్యుసిలేజ్ నీటిని కేవలం ఐదే నిమిషాల్లో వడకట్టడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా నీటిశుద్ధి కేంద్రాల్లో నీటిని వడకట్టడం కోసం అల్యూమినియం సల్ఫేట్ అనే రసాయనాన్ని వాడతారు. ఇది నీటిని వడకడ్టడానికి 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుంటుంది. కానీ మ్యుసిలేజ్ కేవలం ఐదే నిమిషాల్లో వడకట్టడం అద్భుతంగా వారు పేర్కొంటున్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఈ మెక్కపై మరిన్ని పరిశోధనలు చేయడానికి ఈ బృందం సిద్ధమవుతోంది.