ప్రధానమైన నాలుగు యోగాసనాలలో పద్మాసనం కూడా ఒకటే. నీటిలో వుంటూ పద్మం పైన తేలుతూ వున్నట్లు పద్మాసనం అభ్యాసనం చేసిన సాధకులు సంసార బంధనాల్లో చిక్కుకొని వున్నప్పటికీ మానసికంగా వాటికి అతీతంగా వుంటారని యోగా నిపుణుల అభిప్రాయం.
విధానం :
కుడిపాదం ఎడమ కాలి తొడపై వుంచి, కుడి మోకాలు పట్టుకొని పైకి కిందికి కదిలించాలి. తరువాత మోకాలును లేపి గుండ్రంగా తిప్పాలి. అదే విధంగా ఎడమ కాలితో కూడా చేయాలి. రెండు కాళ్లు చాచాలి. తరువాత ఎడమకాలి పాదం కుడి తొడమీద, కుడి కాలి పాదం ఎడమ తొడమీద ఉంచాలి. యిదే పద్మాసనం. రెండుచేతులు రెండు మోకాళ్లపై వుంచి చూపుడు వేలును, బొటన వేలి కణుపుకు ఆనించాలి. మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి చిన్ముద్ర రూపంలో ఉంచాలి.
భృకుటి మీద గాని, నాసికాగ్రం మీద గాని దృష్టిని నిలపాలి. మనస్సును హృదయ కమలంతో ఏకాగ్రం చేయాలి. శ్వాస సామాన్యస్థితిలో ఉంచాలి.
పద్మాసనం పూర్తి అయిన తరువాత కాళ్లు మెల్లగా చాచి మోకాళ్లను విదిలించాలి.
ఇప్పుడు కింద కూర్చునే విధానం తగ్గుతుంది. ఇందువల్ల కాళ్లు, మోకాళ్లు కరుకు ఎక్కుతున్నాయి. వాటిని మడచడం కష్టమవుతున్నది. ఇందువల్ల కొందరు పద్మాసనం పూర్తిగా వేయలేకపోతున్నారు. ఇట్టి స్థితిలో ఒక కాలిపాదం రెండవ కాలి తొడమీద ఉంచి, రెండవ కాలు మొదటి కాలి మోకాలి కింద పెట్టి అర్థ పద్మాసనం అభ్యసించాలి.
కొద్ది రోజులు ఈ విధంగా అభ్యాసం చేస్తే పద్మాసనం వేయడం తేలిక అవుతుంది.
లాభాలు :
ఎక్కువ సేపు కదలకుండా ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల సుఖం కలుగుతుంది. మానసిక అలసట ఉండదు. ఏకాగ్రత కుదురుతుంది. తొడల లోని అనవసరపు కొవ్వు కరుగుతుంది. బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ధ్యాన సాధనకు ఇది ఉత్తమమైన ఆసనం.