చర్మ సౌందార్యాన్ని కాపాడుకోండిలా...


అన్నిరకాల వాతావరణాన్ని ఎదుర్కొంటూ చర్మసౌందర్యాన్ని రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో ఉండే చల్లటి వాతావరణం చర్మంపై హానికారక ప్రభావం చూపిస్తుంది. దీంతో పలు రకాల చర్మ సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు మరింత అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

  •   ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందన్న కారణంతో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది సరైనది కాదు. చర్మంలో తగినంత తేమ నిలిచి ఉండడానికి, చర్మం తాజాగా కనిపించడానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకని రోజులో వీలైనంత నీరు తాగుతూ ఉండాలి.

  • ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.


  •   స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. వాటిల్లో ఉండే హానికారకమైన రసాయనాలే అందుకు కారణం. గ్లిజరిన్, మాయిశ్చరైజింగ్ సబ్బులు ఈ కాలంలో ఉపయోగకరంగా ఉంటాయి. స్నానానికి చల్లటి నీరు కంటే గోరువెచ్చటి నీటిని ఉపయోగించడం మంచిది.ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు.


  • స్నానంలో ఒకటి రెండు చుక్కల బాదం నూనెను వేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.


  • స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. పొడిచర్మం ఉన్నవారు ఆయిల్‌తో తయారైన మాయిశ్చరైజింగ్ క్రీమును, జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ క్రీమును వాడుకోవచ్చు.

  •  చుండ్రు, జుట్టురాలడం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ కోసం సరైన షాంపూతో తలస్నానం చేయడం, సరైన మాయిశ్చరైజింగ్ క్రీమును స్నానం చేసిన తర్వాత రాసుకోవడం చేయాలి.


  • కొంతమంది తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరు. అలా చేయడం వల్ల శిరోజాల సౌందర్యం దెబ్బతింటుంది. కనుక తడి లేకుండా శ్రద్ధ తీసుకోవాలి.


  •   ఈ కాలంలో వాడాల్సిన వాటిలో సన్‌స్క్రీన్ లోషన్ కూడా ముఖ్యమైందే. సాధారణంగా చాలామంది సన్‌స్క్రీన్ లోషన్ అంటే ఎండాకాలంలో మాత్రమే వాడుకునేది అన్న అభిప్రాయం ఉంది. కానీ ఏ కాలంలోనైనా హానికారక సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభించాలంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడుకోవాల్సిందే.


  •   ఈ కాలంలో చర్మం సున్నితంగా మారడం వల్ల పలురకాల సమస్యలు వేధిస్తుంటాయి. పెదాలు, పాదాలపై పగుళ్లు ఈ కాలంలో వే ధించే ప్రధాన సమస్యలు. ఈ విషయంలో పెదాలకు రక్షణగా లిప్‌బామ్‌ను రాసుకోవాలి. లేదా పేరుకున్న నేయి, వెన్నపూసను రాసుకున్నా ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే నీరు, దుమ్ము పాదాల దరిచేరకుండా చూసుకోవాలి. పాదాలకు రక్షణగా నాణ్యమైన సాక్స్‌లు ధరించడం మంచిది. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని, పొడిటవల్‌తో తడుచుకోవాలి. తర్వాత వ్యాజిలైన్ రాసుకుని పడుకుంటే పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.


  •  చేతులు, కాళ్లు కడుక్కున్న తర్వాత అలానే వదిలేయకుండా శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి.


  •  తీసుకునే ఆహారం కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. పీచు ఎక్కువగా ఉండే, శరీరంలో ఉష్ణాన్ని నిలిపి ఉంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.


  •   సులభమైన వ్యాయామంతో చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శీతాకాలంలో వ్యాయామం శారీకంగా, మానసికంగా ఎంతో ప్రభావం చూపుతుంది. కనుక రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి.


  •  గృహిణులు చేతికి సురక్షితమైన గ్లోవ్స్(కవచాలు) ధరించి పనులు చే సుకోవడం మంచిది.


  •   చల్లదనాన్ని నిరోధించే లేదా ఉష్ణాన్నిచ్చే వస్త్రాలు ఈ కాలంలో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top